ఓ పాఠశాల కరెంటు బిల్లు అక్షరాలా లక్ష రూపాయలు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా.. ఆ వివరాలు చూడ్డానికి మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్కి వెళ్దాం. అక్కడి అంగడిపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. గత ఆరు నెలలుగా విద్యార్థులు చీకటి గదుల్లోనే మగ్గుతూ చదువుకుంటున్నారు.
ఐదేళ్లుగా.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకి చెందిన కరెంటు బిల్లులను విద్యాశాఖ అధికారులు చెల్లించడం లేదు. దీంతో విద్యుశాఖ అధికారులు ఆరు నెలలుగా ఆ పాఠశాలకు పవర్ కట్ చేశారు. దీంతో విద్యార్థులు దోమలు, ఈగలతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ సమస్యపై ఎంఈవోకి ఫిర్యాదు చేసినా.. సరైన స్పందన రాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. ఒక్క పేట బషీరాబాద్ మండలంలోని 15 స్కూల్స్.. ఇలా అంధకారంలో ఉన్నట్టు సమాచారం.