వనపర్తి జిల్లాలో మొసలి కలకలం
♦ మస్తీపూర్లో ఓ రైతు పొలం బావిలో కన్పించిన మొసలి ♦ మొసలిని బయటకు తీసి కృష్ణానదిలో వదిలేసిన ఫారెస్ట్ అధికారులు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొసళ్లు కలకలం రేపుతున్నాయి. ఒక వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే.. ఈ నీటితో పాటే మొసళ్లు కూడా పరుగులు పెడుతున్నాయి. ఓ రైతు పొలంలోని బావిలో మొసలి కన్పించి భయాందోళనకు గురిచేసింది.
వనపర్తి జిల్లా అమరచింత మండలం మస్తీపూర్ గ్రామంలో శ్రీనివాసులు అనే రైతు పొలంలోని బావిలో మొసలి కన్పించడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో రైతు శ్రీనివాసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనాస్థలానికి చేరుకొని.. ఎనిమిది గంటల పాటు తీవ్రంగా శ్రమించి.. తాడు సాయంతో మొసలిని బంధించి బయటకు తీశారు. అనంతరం మొసలిని కృష్ణా నదిలో వదిలిపెట్టారు. కృష్ణా నది నీటి ప్రవాహం పెరిగినప్పుడల్లా నదీ పరివాహక రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.