Congress: తెలంగాణలో పాత టీడీపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి
Congress: బీఆర్ఎస్లోని అసంతృప్తులపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్
Congress: తెలంగాణలో పాత టీడీపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి
Congress: తెలంగాణలో అధికారమే టార్గెట్గా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంపై హస్తంపార్టీ నేతలు అధికార బీఆర్ఎస్పై యుద్ధం ప్రకటించారు. మరో వైపు ఇతర పార్టీల నేతల చేరికలతోనూ కాంగ్రెస్ పార్టీలో జోరు కనిపిస్తోంది. అధికార పార్టీలోని అసంతృప్తులు, ఇతర నేతలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్కు చెందిన పాత టీడీపీ లీడర్లను కూడా కాంగ్రెస్ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణలోని పాత టీడీపీ నేతలపై హస్తం పార్టీ దృష్టి సారించింది. వివిధ నియోజకవర్గాల్లో గతంలో టీడీపీలో చురుకుగా పనిచేసి, ఆ తర్వాత బీఆర్ఎస్, ఇతర పార్టీల్లో చేరిన వారిందరినీ కాంగ్రెస్లో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది అదిష్టానం. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తనకున్న పరిచయాలతో ప్రయత్నాలు ప్రారంభించారని చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఎవరెవరు అసంతృప్తులు ఉన్నారో తెలుసుకుని, వాళ్లని పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్లో ఇంపార్టె్న్స్ ఉండి టికెట్ దక్కని వారిని పార్టీలో చేర్చుకోడంతో పాటు.. టీడీపీ క్యాడర్ను తమవైపు తిప్పుకుంటే ఓటు బ్యాంకు కలిసొస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ మహిళా నేత, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్రెడ్డిని పార్టీలోకి రావాలని ఆహ్వానించింది కాంగ్రెస్. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు ఆమె నివాసానికి వెళ్లి కాంగ్రెస్లోకి ఇన్వైట్ చేశారు. ఆ తర్వాత వాళ్లు పీసీసీ చీఫ రేవంత్రెడ్డి సమావేశమయ్యారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో సుపరిచితుడు. ఆయన ప్రస్థానం కూడా టీడీపీతోనే ప్రారంభమైంది. అనంతరం బీఆర్ఎస్లో చేరి పాలేరు బై పోల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ సారి ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు దీంతో తుమ్మలను కూడా కాంగ్రెస్లోకి తీసుకునేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. నిజామాబాద్ నుంచి మరో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావును కూడా పార్టీలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.