CM KCR: తెలంగాణలో వర్షాలపై సీఎం కేసీఆర్‌ ఆరా

CM KCR: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

Update: 2021-09-07 07:55 GMT

సీఎం కేసీఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: తెలంగాణలో వర్షాల పరిస్థితిపై ఢిల్లీ నుంచి సీఎం కేసిఆర్ రివ్యూ నిర్వహించారు. సీఎస్ సోమేశ్‌ కుమార్‌తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. వర్షాలకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సీఎస్‌ను ఆదేశించారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు, మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు.

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభావితమయ్యే విద్యుత్తు, రోడ్లు, నాళాలు తదితర రంగాల పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం కావాలని సీఎం కెసిఆర్ ఆదేశించారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతూ వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, డీఆర్‌ఎఫ్‌ బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

Tags:    

Similar News