తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన 'చలో ట్యాంక్బండ్' ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు అనుమతించనప్పటికీ ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో ట్యాంక్ బండ్ చేరుకున్నారు. పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ బారికేడ్లు, కంచెలపై నుంచి దూకి వచ్చారు. కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. లాఠీ ఛార్జ్ చేశారు. ఆందోళన కారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ప్రతిగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురు కార్మికులు గాయపడ్డారు. లిబర్టీ, దోమలగూడ వైపు ఆందోళన కారులను పోలీసులు తరుముతున్నారు.
ట్యాంక్ బండ్ వైపు వచ్చే అన్ని రహదారులు మూసి వేశారు. హిమాయత్ నగర్ లిబర్టీ వద్ద ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వివిధ సంఘాల నేతలు ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. మరోవైపు ట్యాంక్ బండ్ వైపు వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. సెక్రటేరియట్ బస్టాప్ నుంచి ట్యాంక్ బండ్పైకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో ఆందోళన కారులకు మధ్య తోపులాట జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించారు. పోలీసుసు వలయాన్ని ఛేదించుకుని ట్యాంక్ బండ్ వైపు పలువురు నేతలు పరుగులు తీశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్టీసీ మహిళా కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గోషామహల్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులతో పాటు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.