Hyderabad: మియాపూర్‌లో బీభత్సం సృష్టించిన కారు..

Update: 2020-02-19 04:04 GMT

హైదరాబాద్ నగరంలొ రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. ఒక వైపు ప్రభుత్వం మరో వైపు ట్రాఫిక్ అధికారులు ప్రమాదాలు సంభవించ కుండా ఎన్ని సూచనలు చేసినప్పటికీ ప్రమాదాల సంఖ్య తగ్గడంలేదు. మద్యం మత్తులో వాహనాలను అతి వేగంగా నడపడం వల్లనే ఈ ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. దీంతో ఎంతో మంది వాహనాదారులే కాకుండా, పాదచారులు కూడా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ నగరంలోని బయోడైవర్సటి ఫ్లైఓవర్ పైన నెల రోజుల పరిధిలో 2 సార్లు కారు ప్రమాదాలు సంభవించాయి. అది మరవక ముందే రెండు రోజుల క్రితం భరత్ నగర్ ఫ్లైఓవర్ పైన కారు భీబత్సం సృష్టించింది. ఈ విధమైన వరుస ఘటనలతో హైదరాబాద్ నగరంలోని ఫ్లైఓవర్లు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి.

ఇప్పుడు ఇదే నేపథ్యంలో హైదరాబాద్ నగర శివారులోని మియాపూర్‌లో ఈ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల్లోకెళితే మియాపూర్ రోడ్డుపైన అతి వేగంగా వెలుతున్న ఓ కారు అదుపుతప్పింది. దీంతో ఆ కారు ఇతర వాహనాలకు ఢీకొట్టడమే కాకుండా , అంతే వేగంతో ముందుకు వెలుతూ రోడ్డు పక్కనే ఉన్న పాన్ షాపులోకి దూసుకెళ్లింది. దీంతో పాదచారులు, వాహనదారులు ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. కాగా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించనప్పటికీ, పలువురు వాహనదారులు, పాదచారులు స్వల్ప గాయాలపాలయ్యారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటన జరిగిన తీరును అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత షాపులో చిక్కుకున్న కారును బయటకు తీశారు. క్షతగాత్రల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Tags:    

Similar News