ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక్క సారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎవరో గుర్తుతెలియని ఆగంతకుడు ఉదయం 5.30 గంటలకు 100కు డయల్ చేసి సికింద్రాబాద్ - విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో బాంబు ఉందని బెదిరింపు కాల్ చేసారు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఖంగారుకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు రైలును స్టేషన్ లోనే నిలిపివేసారు.
అనంతరం ఎక్స్ప్రెస్లోని అన్ని బోగీల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో రైలు అనువణువూ తనిఖీ చేసారు. సీ1, సీ3 ఏసీ బోగీలు, లగేజీ బోగీలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ పరిశీలించారు. రైలులో ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకకపోవడంతో అటు అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైలులో ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఎవరో అపరిచిత వ్యక్తి కావాలనే బెదిరించడానికి ఫేక్ కాల్ చేసారని తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.