కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క దీక్ష విరమించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలతో ఆయన తన దీక్షను విరమించారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు నిమ్స్లో నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కాగా సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన నిరవధిక దీక్షను సోమవారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంమతో పోలీసులు దీక్షను భగ్నం చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సకు నిరాకరించి ఆయన దీక్ష కొనసాగించారు. శనివారం నుంచి ఆయన ఎటువంటి ఆహారం తీసుకోకపోవడంతో బీపీ, షుగర్ స్థాయిలు పడిపోయాయని వైద్యులు చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం పోలీసులు భట్టి దీక్షను భగ్నం చేసి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇందిరా పార్క్ దగ్గర భట్టి విక్రమార్క మూడు రోజులగా దీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.