ఆడపిల్ల ఇంకా అంగట్లో సరుకుగానే మిగిలిపోతోంది. తల్లి ఒళ్లో సెదతీరాల్సిన పసిబిడ్డ బజార్లో వస్తువుగా మారిపోతోంది. ఆడబిడ్డ పుట్టగానే ఆర్థికభారం అనుకునే తల్లిదండ్రులు అమ్మకానికి పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాలో పసిపాప అమ్మకం కలకలం రేపుతోంది. 18 వేలకు అమ్మకానికి పెట్టిన ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాలో సభావత్ శ్రీను, సరిత దంపతులకు 4 వ సంతానంగా ఆడపిల్ల జన్మించింది. అయితే కూలీ పనులు చేస్తేనే కుటుంబం గడుస్తుండటంతో ఆర్థికభారం మోయలేక ఆ పసిపాపను అమ్మకానికి పెట్టారు. 45 రోజుల పసిపాపను 18 వేలకు చంపాపెట్ ప్రాంతానికి చెందిన మనీషా, రమేష్ దంపతులకు విక్రయించాడానికి సిద్ధమయ్యారు.
అయితే సీన్లోకి SOT పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పక్క సమాచారం అందుకున్న పోలీసులు పాప విక్రయాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ అనుదీప్ తెలిపారు. అమ్మకానికి ప్రయత్నించిన తల్లిదండ్రులతో పాటు కొనేందుకు సిద్ధమైన దంపతులు, మధ్యవర్తులపై కేసులు నమోదయ్యాయి. ఇటు పాపను శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు.
మరోవైపు తాము పాపను విక్రయానికి పెట్టలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. పోషించే స్థోమత లేదని అందుకే తమ తమ్ముడి స్నేహితుడికి పాపను దత్తత ఇచ్చామని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి డబ్బులు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. గ్రామంలో ఇలాంటి శిశు విక్రయాలు ఇదివరకు చోటు చేసుకున్నాయని కౌన్సెలింగ్ ఎంతలా ఇస్తున్నా తండా వాసుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు.