సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలి: మిద్దెతోట నిపుణులు
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే చింతలబస్తీలోని రైతు నేస్తం కార్యాలయంలో మిద్దెతోటపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే చింతలబస్తీలోని రైతు నేస్తం కార్యాలయంలో మిద్దెతోటపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిద్దెతోట నిపుణులు తుమ్మెటి రఘోత్తం రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ వలన ప్రపంచ మానవాళి ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతుందని అన్నారు.
అంతే కాదు పంటపొలాల్లో, తోటలలో పురుగుల మందులను ఎక్కువగా వాడడం వలన ఆహారపదార్థాలన్ని విషపూరితమవుతున్నాయని తెలిపారు. దీంతో చాలా మంది ప్రజలు క్యాన్సర్, ఉదర సంబంధిత వ్యాధులతో తెలియని అనేక వ్యాధులు వస్తున్నాయని అన్నారు. ఈ కారణంగా మనుషుల ఆయిశ్శు రోజురోజుకు తగ్గిపోతుందని తెలిపారు.
ఈ అపాయం నుంచి తప్పించుకోవాలనుకుంటే సొంతిళ్లు ఉన్న ప్రతి ఒక్కరూ మిద్దె తోటలు ఏర్పాటు చేసుకునే విధంగా పాలక ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. మిద్దె తోటలు, పెరటి తోటలు పెంచి కూరగాయలను పండించుకోవడం వలన తాజా కూరలను భుజించవచ్చని దాంతో ఆరోగ్యం మెరుగు పడుతుందని తెలిపారు.
అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రావి చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం సాగు భూమి, నీరు లభ్యత తగ్గిపోయిందని అన్నారు. ఈ క్రమంలోనే నగరాల్లో, పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటల ఆవశ్యకత పెరిగిందని తెలిపారు. అనంతరం రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ వై.వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ గత రెండేళ్లుగా మధ్య తరగతి ప్రజలు ఆరోగ్యం కోసం ఈ మిద్దెతోటల ఉపయోగాన్ని వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు.