వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అభ్యర్థుల ఎంపికకు టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. కొందరు అభ్యర్థులను ఖరారు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డిని నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా సీఎం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో నెల్లూరు లోక్సభకు పోటీ చేసిన ఆదాల ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పడంతోనే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఆదాలకు పూర్తి మద్దతు ఉంటుందని మంత్రి సోమిరెడ్డి చెబుతున్నారు. కాగా నెల్లూరు రూరల్ సోమిరెడ్డి సొంత నియోజకవర్గం. కానీ ఆయన పోయిన ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేశారు. ఇదిలావుంటే ఆదాల చివరి నిమిషంలో ఎంపీ రేసు నుంచి తప్పుకోవడంతో నెల్లూరు ఎంపీ స్థానానికి జెడ్పి ఛైర్మెన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, బీద మస్తాన్ రావు పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం.