Revanth Reddy: ఓటుకు నోటు కేసు..విచారణ వాయిదా..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది.ఈ కేసులో ఏ1గా ఉన్న కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి మరో కేసులో చెర్లపల్లి జైలులో ఉన్న కారణంగా ఇవాళ ఆయన కోర్టుకు హాజరు కాలేక పోయారు. దీంతో కోర్టు విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
2015 లో మొదలయిన ఈ కేసు ఒక్క సారిగా తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను తమ వైపునకు ఆకర్షించేందుకు 50 లక్షల రూపాయలు ఇస్తూ రేవంత్ రెడ్డి కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ను కలిసిన వీడియోలు, డబ్బులిచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్టీఫెన్సన్తో మాజీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడిన ఆడియో ఫుటేజీ కూడా వైరల్ అయ్యింది. ఈ కేసులోనే రేవంత్ రెడ్డిని ఏసిబి అధికారులు అరెస్టు చేసారు. ఆ తరువాత ఆయన కొన్ని నెలలపాటు జైలులో ఉండి తరువాత బయటికి వచ్చారు. అయితే ఈ కేసులో ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది.
కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహలు ఈ రోజున కోర్టుకు హాజరయ్యారు. కాగా ఏసీబీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు స్వీకరించి మొత్తం 960 పేజీలతో కూడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. కేసులో ఆడియో టేపుల FSL నివేదికను సైతం ఏసీబీ కోర్టుకు అప్పగించారు. ఇక ఈ కేసులో రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్కు ఇవ్వాలని చూసిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది కీలకం కానుంది.
ఇక పోతే ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ప్రాణ ఉందని రక్షణ కల్పించాలని కోరారు. ఈ కేసులో తనని అన్యాయంగా ఇరికించారని వ్యాఖ్యలు చేసారు. ఈ కేసు కారణంగా తనకు బెదిరింపులు, దాడులు ఎదురవుతున్నాయని తెలిపారు.