హైదరాబాద్ లో మరో దారుణం..11 ఏళ్ల బాలికపై అత్యాచారం
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. 'దిశ' హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ తర్వాత కామాంధుల్లో కాస్తయినా భయం పుట్టి ఇలాంటి నేరాలు చేయరని ప్రజలంతా సంతోషించారు. కానీ ప్రజలు ఏదైతే అనుకున్నారో సమాజంలో దానికి వ్యతిరేకంగానే చర్యలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్లో రోజూ మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మరువక ముందే మళ్లీ అదే భాగ్యనగరంలో మరో సామూహిక అత్యాచార ఘటన వెలుగుచూసింది.
పూర్తివివరాల్లోకెళితే హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి అలీనగర్లోని రంగుల పరిశ్రమలో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి 11 ఏళ్ల కుమార్తె ఉంది. ఈనెల 13న తన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అతను పనికి వెళ్తూ తన 11 ఏళ్ల కుమార్తెను కూడా వెంట తీసుకెళ్లాడు. తండ్రితో పాటు అతడు పనిచేసే పరిశ్రమకు వెళ్లిన ఆ బాలికపై ముగ్గురు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ బాలిక తండ్రి పనిలో నిమగ్నమై ఉండగా బాలిక పరిశ్రమలో ఒంటరిగా తిరుగుతుండడం దుండగులు గమనించారు. దీంతో ఆ ముగ్గుకు కామాంధులు ఆమెను బెదిరించి సమీపంలోని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ బాలికన బెదిరించారు. భయపడిన బాధితురాలు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు.
ఇంటికి తిరిగి వచ్చిన బాలిక మూడు రోజుల నుంచి దిగులుగా ఉండడంతో గమనించిన తల్లిదండ్రులు మంగళవారం ఆమెను నిలదీసారు. దీంతో బాధితురాలు తన తల్లిదండ్రులకు జరిగిన సంఘటన గురించి చెప్పి విలపించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించి ఆమె తండ్రి వెంటనే చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటన జరిగిన ప్రాంతం మైలార్దేవ్పల్లిలో జరగగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అనంతరం అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.