డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి మృతి
♦ నిన్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శ్రీనివాస్రెడ్డి ♦ రాత్రి హైదరాబాద్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలింపు ♦ కాసేపటి క్రితం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన శ్రీనివాస్రెడ్డి
నిన్న ఖమ్మం బస్ డిపో ముందు ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాస్రెడ్డి మృతిచెందాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నిన్న ఒంటిపై పెట్రోల్ పోసుకుని డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి నిప్పంటించుకున్నాడు. వెంటనే గమనించిన సహచర కార్మికులు.. కుటుంబ సభ్యులు మంటలను ఆర్పారు. అయితే అప్పటికే అతడి శరీరం 90 శాతానికి పైగా కాలిపోయింది. హుటాహుటిన తొలుత ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న వైద్యులు హైదరాబాద్కు రిఫర్ చేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి శ్రీనివాస్రెడ్డిని తరలించారు. నిన్న రాత్రి నుంచి చికిత్స పొందుతున్న శ్రీనివాస్రెడ్డి ఉదయం తుదిశ్వాస విడిచాడు.
మరోవైపు డీఆర్డీవో అపోలో ఆస్పత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రీనివాస్రెడ్డిని పరామర్శించేందుకు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు వచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్, టీజేఎస్ అధినేత కోదండరామ్.. ఇతరులను కొద్ది మందిని మాత్రమే ఆస్పత్రిలోనికి అనుమతించారు. అయితే శ్రీనివాస్రెడ్డి మరణించాడన్న వార్త తెలిసే సరికి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడికి వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.