ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే ఐసీసీ టీ-20 ప్రపంచకప్ పురుషుల, మహిళల టోర్నీల షెడ్యూల్ ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. టీ-20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారిగా ఒకే ఏడాది.. కొద్దివారాల తేడాలో పురుషుల, మహిళల ప్రపంచకప్ టోర్నీలు నిర్వహించడానికి ఐసీసీ ఏర్పాట్లు చేసింది. 2020 అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకూ పురుషుల ప్రపంచకప్ నిర్వహిస్తారు. మహిళా టీ-20 ప్రపంచకప్ ఫిబ్రవరి 21న ప్రారంభమై ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8న ముగియనుంది. ఆస్ట్రేలియాలోని మొత్తం ఎనిమిది నగరాలలోని 13 వేదికల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. పురుషుల విభాగంలో టీమిండియా తన ప్రారంభమ్యాచ్ ను పెర్త్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ఆడనుంది. మహిళల విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో భారత్ ఫిబ్రవరి 21న జరిగే ప్రారంభమ్యాచ్ లో ఢీ కొంటుంది. మహిళల గ్రూప్- ఏ లీగ్ లో ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ తో పాటు మరో క్వాలిఫైయర్ జట్లతో భారత్ పోటీపడుతుంది. పురుషుల సూపర్ -12 రౌండ్లో ఆస్ట్రేలియా, అప్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లతో పాటు క్వాలిఫైయింగ్ రౌండ్ల నుంచి అర్హత సాధించిన మరో రెండుజట్లతో టీమిండియా తలపడాల్సి ఉంది.
మ్యాచ్ల షెడ్యూల్ ఇలా..
పురుషుల ప్రపంచకప్..
క్వాలిఫయర్స్ మ్యాచ్లు : అక్టోబర్ 18 నుంచి 23 వరకు
గ్రూప్ మ్యాచ్లు :అక్టోబర్ 24-నవంబర్ 8
గ్రూప్ 1 : పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, రెండు అర్హత సాధించిన జట్లు.
గ్రూప్ 2 : భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గనిస్థాన్, రెండు అర్హత సాధించిన జట్లు
సెమీ ఫైనల్స్ : నవంబర్ 11, 12
ఫైనల్స్ : నవంబర్ 15
మహిళల ప్రపంచ కప్ :
గ్రూప్ మ్యాచ్లు : ఫిబ్రవరి 21-మార్చి 3
గ్రూప్ ఏ :ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, శ్రీలంక, క్వాలిఫయర్ 1
గ్రూప్ బి :ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, క్వాలిఫయర్ 2
సెమీఫైనల్స్: మార్చి 5
ఫైనల్: మార్చి 8