టీమిండియా దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2004లో ఆస్ట్రేలియాపై చేసిన ద్విశతకం నా దృష్టిలో క్రమశిక్షణ ఇన్నింగ్స్ అని విండీస్ మాజీ దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ ప్రభావంతో క్రికెట్ టోర్నీలు రద్దవడంతో లారా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుటున్నాడు. ఈ మేరకు ఓ అభిమాని సచిన్ బెస్ట్ ఇన్నింగ్స్ ఏది..? అని ప్రశ్నించగా లారా జవాబు ఇచ్చాడు.
ఆస్ట్రేలియాతో 2004లో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ 436 బంతులు ఎదుర్కొని 241 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్లో సచిన్ ఒక్క కవర్ డ్రైవ్ షాట్ ఆడకుండా పట్టుదలతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ని 705/7తో డిక్లేర్ చేయగా టీమిండియా బౌలర్లు ఆ మ్యాచ్ లో నిరాశపరిచారు. దీంతో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
సచిన్ క్రికెట్ కెరీర్ గురించి లారా మాట్లాడుతూ ''16 ఏళ్లకే టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి, 24 ఏళ్ల క్రికెట్ ఆడటం నమ్మశక్యంగా లేదు కదా..? అని అన్నారు. సచిన్ తన కెరీర్లో ఎన్నో ఉత్తమ ఇన్నింగ్స్ లు ఆడాడు. కానీ.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో అంకిత భావం, క్రమశిక్షణని కనబర్చాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా మెలగాలో..? సచిన్ 241 ఇన్నింగ్స్ చూసి మనం నేర్చుకోవచ్చు అని వెల్లడించాడు. ఇటీవటే రోడ్ సేఫ్టి వరల్డ్ సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ లెజెండ్స్ జట్టు తరపున లారా మళ్లి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావంతో రోడ్ సేఫ్టి వరల్డ్ సిరీస్ రద్దయింది.