సరస్వతి నదీ ఎక్కడుంది... మీకు కనిపించిందా? లాజిక్‌ చూడండి

Update: 2019-08-28 05:02 GMT

ఇప్పుడు ప్రయాగ రాజ్ గా మారిన అలహాబాద్ ఒకప్పుడు ప్రయాగే. మధ్యలో అలహాబాద్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ పూర్వ నామం సంతరించుకుంది. అయితే, ప్రయాగ ప్రత్యేకత ఏంటి? గంగ, యమున, సరస్వతీ నదుల మహా పవిత్ర సమ్మేళనమే ఈ ప్రయాగ. సరస్వతీ నది సనాతన ధర్మాన్ని ఆచరించే ఆస్థికుల అనాది పుణ్య తీర్థం. ఆ నదీ తీరంలోనే మన సంస్కృతి, మన సంప్రదాయం పురుడు పోసుకుని, పరిఢవిల్లాయి. అందుకే, సరస్వతీ నది ప్రస్తావన భూమ్మీది అత్యంత పురాతనమైన ఋగ్వేదంలోనూ ఉంది. సరస్వతీ ప్రవాహం పక్కనే మన ఋషులు, మునులు తొలి సూక్తాల్ని దర్శించారు. అలాగే, ఆ పవిత్ర సరస్వతీ జలాలతోనే మన రైతులు మొట్ట మొదటి పంటలు పండించారు. పరబ్రహ్మ స్వరూపం అని భావించే అన్నం మనకు సరస్వతీ నదీమతల్లే ప్రసాదించింది. మరి తరువాత సరస్వతీ ఏమైపోయింది?

సరస్వతీ నది ఇప్పుడు మనం గుజరాత్, రాజస్థాన్, పాకిస్తాన్ అంటూ వ్యవహరిస్తోన్న ప్రాంతాల్లో ప్రవహించేదట. ఒకప్పుడు ఆ నది మహోగ్ర జలాలతో సమృద్దిగా ఉండేది. ఆ నది ఇటు యమున , అటు సట్లెజ్ గా పిలవబడుతోన్న శతధృ నదుల మధ్య ఉండేదని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. మహాభారతం కూడా అదే ధృవ పరుస్తోంది. అయితే, సరస్వతీ నది అనేక కారణాల వల్ల అదృశ్యమైపోయింది. ఎందుకు ఒకప్పటి మహానది ఇప్పుడు లేకుండా పోయిందని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు. అయితే, దిశల్ని మార్చుకున్న ఋతుపవనాలు, తీవ్ర భూకంపాలు, వాతావరణ మార్పులు... ఇలా ఎన్నో కారణాలు దాగి ఉండవచ్చు. లేదా మనకు తెలియంది, ఊహించలేనిది కూడా అయ్యి ఉండవచ్చు!

ఇంతకీ, సరస్వతి ఎందుకు కనిపించకుండా పోయింది? ఈ ప్రశ్నకి సరైన సమాధానం ప్రస్తుతం ఎవ్వరి వద్దా లేదు. కానీ, చాలా రకాల అనుమానాలు మాత్రం ఉన్నాయి. అయితే, భూమిపై ఎన్నెన్నో నదులు సరస్వతీలా అంతర్థానం అయ్యాయి. ఇక ముందు కూడా అవుతాయి. అందుకు ఒక్కోసారి తీవ్ర భూకంపాలు కూడా కారణం కావచ్చు. భూమి మనం ఊహించలేని స్థాయిలో కంపించినప్పుడు నది మొత్తం అంతర్వాహిని అయిపోవచ్చు. అలా అస్థిత్వంలో లేకుండి ఉంటే... ఎవరు మాత్రం ఎందుకని దాన్ని తరతరాలు ప్రస్తావిస్తారు? ఒక కల్పన ఒక జాతి మస్తిష్కంలో నిరంతరం ఎందుకు మిగిలిపోతుంది? కాబట్టి సరస్వతీ నది ఒక నిజం!

Tags:    

Similar News