కాంచీపురంలోని అత్తివరదర్ స్వామి 40 ఏళ్లకోసారి మాత్రమే దర్శనమిస్తాడు. ఇప్పుడు 15 రోజులుగా స్వామి వారు దర్శనం ఇస్తున్నారు. దీంతో కాంచీపురం భక్తులతో పోటెత్తింది. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అత్తివరదర్ స్వామి కొలువయ్యారు. ఈ స్వామి 40 ఏళ్ల కోసారి మాత్రమె దర్శనమిస్తారు. ప్రస్తుతం త్తివరదర్ స్వామి దర్శన కార్యక్రమాన్ని తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పూజాది లాంఛనాలతో ప్రారంభించగా... గత 15 రోజులుగా స్వామి దర్శనం కోసం భక్తుల వస్తూనే ఉన్నారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో ఆలయం జనసంద్రంగా మారింది.
ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రముఖులతోపాటు లక్షలాది భక్తులు దర్శించుకున్నారు. తమిళులకు శుభంగా భావించి శుక్ర, శనివారాల్లో భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో వరదరాజ పెరుమాళ్ ఆలయ పరిసరాలతోపాటు కాంచిపురంలో తిరుమాడ వీధులు జనంతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.