Delhi: వార్నింగ్ మార్క్ దాటిన యమునా నది.. అత్యవసర సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు
Delhi: వార్నింగ్ మార్క్ దాటిన యమునా నది.. అత్యవసర సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్
Delhi: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే వార్నింగ్ మార్క్ ను దాటిన నది నీటిమట్టం.. ప్రమాదకర స్థాయికి చేరువైంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. వర్షాలపై తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే, ప్రస్తుతానికి ఢిల్లీకి వరద పరిస్థితి రాకపోవచ్చని చెప్పారు.
భారీ వర్షాల కారణంగా హతనికుంద్ బ్యారేజ్ నుంచి హరియాణా మరింతగా నీటిని విడుదల చేసింది. దీంతో యమునా నది నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జ్ వద్ద యమునా నది నీటిమట్టం వార్నింగ్ మార్క్ దాటి 204.63 మీటర్లకు చేరింది. రేపు మధ్యాహ్నం 12 గంటల నాటికి నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటి 205.5 మీటర్లకు చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వరద ముప్పు పొంచి ఉండటంతో ఢిల్లీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ మంత్రి ఆతిషి యమునా నది పరిస్థితిని పర్యవేక్షించారు. ఇప్పటికే 16 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. క్విక్ రెస్పాన్స్ టీమ్, బోట్లను అందుబాటులో ఉంచారు.