మరో రెండు రోజుల్లో శభరిమల ఆలయం తెరుచుకోనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయంతో కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన అంశాన్ని నిశితింగా పరిశీలిస్తున్నామని కేరళ సీఎం పినరాయి విజయన్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుపై మరింత స్పష్టత కావాలంటున్నారు ఆయన. సుప్రీంకోర్టు ఉత్తర్వుల విషయంలో ఉన్న సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతే మహిళల ఆలయ ప్రవేశంపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కోర్టు ఉత్తర్వులు ఏవైనా సరే అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు.
మరో వైపు సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ స్పందించారు. ఈనెల 16న శబరిమల అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తామని ప్రకటించారు. తనతో పాటు మరికొందరిని తీసుకు వెళ్తానని చెప్పారు. శబరిమళ వెళ్లి పూజలు చేసేందుకు మహిళలకు ప్రవేశం ఉందని ఇందుకు వ్యతిరేకంగా ఎవరూ నిరసనలు చేయకూడదన్నారామె. శబరిమల కేసు తీర్పు విషయంలో ధర్మాసనం జాప్యం చేయకూడదని సాధ్యమైనంత త్వరగా తుది తీర్పు వెలువరించాలని అభిప్రాయపడ్డారు.