ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుచేయాలని పార్లమెంటులో పోరాటం చేస్తున్న టీడీపీ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, మురళీమోహన్, బుట్టారేణుక, అవంతి శ్రీనివాస్తో పాటు మాగంటి బాబు, జేసీ దివాకర్రెడ్డి, శ్రీరాం మాల్యాద్రి, అశోక్ గజపతిరాజు, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణలను నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేశారు.
ఇక టీడీపీ ఎంపీలు సస్పెన్షన్ కు గురవడంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. సస్పెన్షన్ పై స్పందించిన ఎంపీలు.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆందోళన చేస్తున్న తమను సభ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. మరోవైపు ఇవే అంశాలతో వైసీపీ ఎంపీలు రాజ్యసభలో నిరసన తెలుపుతున్నారు. ఆ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలుసుపుతున్నారు.