మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మాస్వరాజ్ హఠాన్మరణం చెందారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. కార్డియాక్ అరెస్ట్తో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన సుష్మా చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సుష్మా... బీజేపీలో అగ్రనాయకురాలిగా ఎదిగి... ఎన్నో ముఖ్య పదవులు నిర్వహించారు. ఐక్యరాజ్యసమితిలాంటి ఫ్లాట్ఫామ్స్పై తన వాడివేడి ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. అగ్రరాజ్యాలతోపాటు పలు కీలక దేశాలతో ద్వైపాక్షిక, స్నేహ సంబంధాలు మెరుగుదలకు విశేష కృషిచేశారు.
ఇక పాకిస్తాన్ తీరును అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టడమే కాకుండా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాక్ను దోషిగా నిలబెట్టారు. అలాగే కుల్ భూషణ్ జాదవ్ వ్యవహారంలో సుష్మా కీలకంగా వ్యవహరించారు. గూఢచర్యం ఆరోపణలతో జాదవ్కు పాక్ సైనిక కోర్టు విధించిన మరణశిక్షను అంతర్జాతీయ కోర్టులో సవాలు చేయడమే కాకుండా, సరైన వాదనలు వినిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సుష్మా తీసుకున్న చొరవతోనే కుల్భూషణ్ జాదవ్కు పాక్ విధించిన మరణశిక్షను అంతర్జాతీయ కోర్టు నిలిపివేసింది. అలా, విదేశీ వ్యవహారాల్లో సుష్మాస్వరాజ్ కీలక పాత్ర పోషించి, దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు.