అయోధ్య భూ వివాదంపై తీర్పు...134 ఏళ్ల వివాదానికి తెరపడుతుందా?
అయోధ్య భూ వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కాసేపట్లో తుది తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెల్లడించనుంది.
అయోధ్య భూ వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కాసేపట్లో తుది తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెల్లడించనుంది. దశాబ్ధాల నాటి నుంచి వివాదంగా మారిన భూ యాజమాన్య హక్కు ఎవరికి చెందుతుందో తీర్పులో వివరించనుంది. సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నవంబర్ 9, 2019 చరిత్రలో నిలిచిపోయే రోజుగా మారబోతోంది. కొన్ని దశాబ్ధాలుగా వివాదాస్పదంగా ఉన్న అయోధ్య భూ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఉదయం 10 గంటలా 30 నిమిషాలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు కల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. సీజేఐ ఈ నెల 17 న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అంతకుముందే ఈ చారిత్రక తీర్పు వెలువరించనున్నారు.
ఈ తీర్పును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించనుంది. ఇందులో సీజేఐ రంజన్ గొగోయ్ సహా.. జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూ యాజమాన్య హక్కుపైనే ప్రధానంగా తీర్పు రానుంది. గతంలో అలహాబాద్ హైకోర్టులో ఏ కక్షిదారులైతే ఉన్నారో.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా ఆ మూడు పార్టీలే.. కక్షిదారులుగా వాదనలు వినిపించాయి. నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డ్, హిందూ మహాసభ నుంచి తమ న్యాయవాదులు.. రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు వినిపించాయి.
మొదట వివాదాస్పద స్థలంపై అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ తర్వాత అలహాబాద్ న్యాయస్థానంలోని ముగ్గురు సభ్యులు కల ధర్మాసనం 2010, సెప్టెంబర్ 10 న తీర్పు వెలువరించింది. అయోధ్యలో వివాదానికి కేంద్రంగా మారిన 2.77 ఎకరాల భూమిని.. ముగ్గురు కక్షిదారులు సమాన భాగాలుగా విభజించాలని.. అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ 14 పిటీషన్లు దాఖలు కాగా.. 2011 మే లో సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్ట్ తీర్పుపై స్టే విధించింది.
మొత్తం 14 పిటిషన్లను విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేసింది. తొలుత ఈ అంశంలో మధ్యవర్తిత్వానికి అవకాశం కూడా ఇచ్చింది. ముగ్గురు సభ్యులను కూడా నియమించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీమ్ ఖలీఫుల్లా అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. అందులో అధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వకేట్ శ్రీరాం పంచూ ఉన్నారు. అయితే మధ్యవర్తిత్వం ఫలించకపోవడంతో.. రోజూవారీ విచారణను రాజ్యాంగ ధర్మాసనం ప్రారంభించింది. ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి అక్టోబర్ 16 వరకూ రోజువారీ విచారణ చేపట్టింది. ముగ్గురు కక్షిదారులు తమ వాదనలు వినిపించారు. పూర్తి వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం.. తుది తీర్పును రిజర్వ్ చేసింది.
కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశంగా మారడంతో అయోధ్య తీర్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీలు, ప్రముఖులతో పాటు.. సాధారణ ప్రజలకు కూడా ఈ తీర్పుపై ఆసక్తి పెరిగింది.