ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. గత 22 వారాలుగా 300 శాతం పెంచిన హాస్టల్ ఫీజులపై ఆందోళనలు జరుపుతున్నారు. అయినా ఇప్పటి వరకు యూనివర్సిటీ యాజమాన్యం దిగిరాకపోవడంతో సోమవారం పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వంద మంది ఆందోళన కారులను నిర్భంధంలోకి తీసుకున్నారు. లాఠీ చార్జ్లో అమ్మాయిలు, అంధ విద్యార్థులు అని చూడకుండా ఇష్టారాజ్యంగా విరుచుకుపడ్డారు. దీన్ని ఖండిస్తూ ఈరోజు ప్రెస్మీట్ నిర్వహించారు ఢిల్లీ జేఎన్యూ విద్యార్థులు.
పెంచిన ఫీజులపై త్రిసభ్య కమిటీని నియమించింది కేంద్రం. అయితే ఆ కమిటీని ఇప్పటి వరకూ కనీసం వీసీ కూడా కలవలేదు. ఫీజులను తగ్గించాలన్న విద్యార్థుల డిమాండ్ను త్రిసభ్య కమిటీకి తెలియచేయలేదు. ఇదిలా ఉంటే విద్యార్థుల ఆందోళనలతో పార్లమెంట్ సమీపంలోని ఢిల్లీ మెట్రో స్టేషన్లు, ఉద్యోగ భవన్, పటేల్ చౌక్, లోక్ కల్యాణ్ మార్గ్ ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేశారు. పోలీసుల అరాచకాన్ని నిలదీస్తూ విద్యార్థులు ట్విట్టర్లో పోస్ట్లు చేశారు.
జేఎన్యూ విద్యార్థుల చేపట్టిన చలో పార్లమెంట్లో పోలీసులు అమానుషంగా లాఠీ ఝుళిపించారు. వంద మంది విద్యార్థులను నిర్భందించారు. స్టేషన్కు తరలించి లైట్స్ ఆపి మరీ చితకబాదారు. అమ్మాయిలు, అంధవిద్యార్థులు అని కూడా చూడలేదని, పోలీసులు తమ పట్ట అమానుషంగా ప్రవర్తించారని అంధ విద్యార్థి శశి భూషణ్ తెలిపాడు. అయితే ఓ పోలీసు తనను పట్టుకుని కొడుతుంటే, తోటి విద్యార్థులు మానవహారంగా నిలబడి తనను రక్షించాలని అనుకున్నారని, తాను అంధుడినని చెప్పానని, అయినా వినకుండా తోటి విద్యార్థులను చెదరగొట్టి గుండెలపై, పొట్టపై, గొంతుపై బూట్లతో తొక్కుతూ హించారని శశి భూషణ్ తన ఆవేదనను మీడియాతో పంచుకున్నాడు.