ముంబైని వరదలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంబై నగరాన్ని అతలాకుతలం చేశాయి. నగరవాసులు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ముంపు ప్రాంతాల్లోని పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ముంబై మహానగరం అతలాకుతలం అవుతోంది. నగర శివారు ప్రజలు ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.
దీంతో ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, సముద్రపు అలలు ఎగిసిపడుతున్న దృష్ట్యా ఆవైపుగా వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంప్రదించేందుకు హెల్ప్లైన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేం దుకు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని సన్నద్ధం చేశారు. ముంబైతో పాటు సమీపంలోని థానే, పాల్ఘర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. థానే జిల్లాలో ఒక వ్యక్తి విద్యుతాఘాతానికిగురై మృతిచెందాడు. పైకప్పు కూలిన మరో వ్యక్తి గాయపడిన ఘటన ముంబ్రా జిల్లాలో చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల ధాటికి థానే, పాల్ఘర్ జిల్లాలో కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పాల్ఘర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద నీరుగా భారీగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రైల్వే, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంజయ్ గాంధీ జాతీయ పార్కులో వరద నీరు చేరడంతో సందర్శన నిలిపివేశారు. ముంబై-గోవా హైవే పై రాకపోకలు ఆగిపోయాయి. భారీ వర్షాల కారణంగా సముద్ర తీర ప్రాంత రహదారులపై చెత్త కొట్టుకు రావడంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది. దానిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.