అగ్రవర్గాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈబీసీ బిల్లును సవాల్ చేస్తూ గురువారం భారతీయ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలైంది. పార్లమెంట్ ఆమోదించిన బిల్లును కొట్టివేయాలంటూ యూత్ ఫర్ ఈక్వాలిటీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రిజర్వేషన్లకు ఆర్థిక ప్రమాణాలే ఏకైక ఆధారం కాదని పిటిషనర్ పేర్కొన్నారు. కాగా కేంద్రం ప్రవేశపెట్టిన 10 శాతం రిజర్వేషన్ బిల్లుకు న్యాయపరమైన అడ్డంకులు తప్పవని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పిల్ దాఖలవడం విశేషం. ఇదిలావుంటే అగ్ర కులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఈనెల 7న ఈ బిల్లుకు ఆమోదం తెలిపగా.. పార్లమెంటు కూడా ఆమోదం తెలిపింది.