సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో.. శనివారం సాయంత్రం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తో సహా.. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై చర్చించాలని.. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని.. కోరారు. అయితే ఎన్డీయే నుంచి శివసేన వైదొలగడంతో.. పార్లమెంట్ ఉభయసభల్లో ఆ పార్టీ ఎంపీలు కూర్చొనే స్థానాలు మారాయి. ప్రతిపక్ష పార్టీల దగ్గరకు శివసేన సభ్యుల స్థానాలను మార్చారు.
తమ రాష్ట్ర సమస్యలను సభలో ప్రస్తావించేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరినట్లు.. తెలుగు రాష్ట్రాల ఎంపీలు తెలిపారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలు, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు అంశాలే తమ ప్రధాన ఎజెండా అని.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్రెడ్డి తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలను.. పార్లమెంట్లో ప్రస్తావించేందుకు అనుమతించ వద్దని స్పీకర్ను కోరినట్లు నామా నాగేశ్వరరావు తెలిపారు.