మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై హైడ్రామా
-నేడు కాంగ్రెస్ - ఎన్సీపీ నేతల భేటీ -ప్రభుత్వ ఏర్పాటు, విధివిధానాలపై చర్చ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య మంతనాలు సాగుతున్నాయి. ఆ రెండు పార్టీల ముఖ్యనాయకులు ఇవాళ ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఇప్పటికే శరద్ పవార్.. సోనియాగాంధీతో సమావేశమై కనీస ఉమ్మడి ప్రణాళికపై ఇరువురు చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేనతో సంప్రదింపులకు ముందు కామన్ మినిమం ప్రోగ్రామ్కు తుదిరూపు తీసుకురావాలని ఎన్సీపీ-కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ చేజారిన పరిస్థితుల దృష్ట్యా, మహారాష్ట్ర విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. నిబద్ధతతో వ్యవహరించాలని సొంత పార్టీ నేతలకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.
శివసేనతో జట్టుకట్టే విషయమై కొన్ని రోజులుగా కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ఓ సారి మద్దతిస్తామని, మరోసారి లేదంటూ పవార్ శివసేనను కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. సేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే... ముందుగా తమ భాగస్వామి కాంగ్రెస్తో ఓ అభిప్రాయానికి రావాల్సిన అసరముందని చెబుతున్నారు శరద్ పవార్.