దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు ప్రారంభించింది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో కీలక సమావేశాలు చేపట్టనుంది. సెప్టెంబర్ 12న పిసిసి అధ్యక్షులు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, సీఎల్పీ లీడర్లతో సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 13న ఏఐసీసీ సెక్రటరీల సమావేశం చేపట్టనున్నారు. ప్రజా సమస్యలపై వెంటనే నివేదికలు అందజేయాలని పిసిసి అధ్యక్షులకు కాంగ్రెస్ అధిష్టానం నిర్దేశించింది. ఏఐసీసీ సారధ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారిగా జరగనున్న సమావేశాలు కావడంతో చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష పదవికి పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శైలజానాథ్, పల్లంరాజు, జేడీ శీలం, చింతా మోహన్, గిడుగు రుద్రరాజు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ పీసీపీ అధ్యక్షుని ఎంపిక ఇప్పట్లో లేనట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు, హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పూర్తయిన తర్వాతనే తెలంగాణ పీసీపీ మార్పుపై అధిష్టానం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.