నిర్భయ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు జడ్జి ఆర్ భానుమతి కోర్టురూమ్లోనే సొమ్మసిల్లి పడిపోయారు. ఈ కేసులో దోషులందరినీ ఒకేసారి ఉరితీయకుండా వేర్వేరుగా ఉరితీసేందుకు అవకాశం కల్పించాలని కేంద్రం వేసిన పటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఐతే ఈ సందర్భంగా ఆర్డర్ కాపీ చదువుతూ జడ్జి ఆర్. భానుమతి సొమ్మసిల్లి పడిపోయారు. అప్రమత్తమైన కోర్టు సిబ్బంది ఆమెను హుటాహుటిన చాంబర్కు తీసుకెళ్లారు. వెంటనే ఆ కేసును వాయిదా వేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. ఆర్డర్ను త్వరలో రిలీజ్ చేస్తామన్నారు. జస్టిస్ భానుమతికి తీవ్ర జ్వరం ఉన్నదని, చాంబర్లో డాక్టర్లు ఆమెను పరిశీలిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
అంతకుముందు నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ పిటిషన్పై జస్టిస్ భానుమతి ధర్మాసం తీర్పు వెల్లడించింది. రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటీషన్ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వినయ్ శర్మ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్ లో వినయ్ శర్మ పేర్కొన్న విధంగా అతను ఆనారోగ్యంతో లేడని.. ప్రస్తుతం అతని మానసిక స్థితి సరిగానే ఉందని సుప్రీంకోర్టు వెల్లడించింది. వినయ్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడని కోర్టు తెలిపింది.