కేంద్ర మాజీ మంత్రి చిదంబరం 14రోజుల పాటు తిహార్ జైలులో గడపనున్నారు. మనీలాండరింగ్ కేసులో చిదంబరాన్ని తిహార్ జైలుకు పంపాలని సీబీఐ చేసిన విన్నపాన్నిప్రత్యేక న్యాయస్థానం అంగీకరించింది. దీంతో మాజీ మంత్రి చిదంబరం సెప్టెంబర్ 19 వరకు తిహార్ జైలులో ఉండనున్నారు. జెడ్ ప్లస్ కేటగిరీకి చెందిన వ్యక్తి కావడంతో చిదంబరానికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. తనతో పాటు మందులను తీసుకువెళ్లందుకు చిదంబరానికి కోర్టు అనుమతిచ్చింది. చిదంబరానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.
అంతకు ముందు చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీం నిరాకరించింది. అరెస్ట్ నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఆర్ధిక నేరాల కేసుల్లో ముందస్తు బెయిల్ అనేది అత్యంత అరుదుగా మాత్రమే జరుగుతుందని ధర్మాసనం తెలిపింది. పూర్వాపరాలను పరిశీలించిన మీదట చిదంబరం పిటిషన్ బెయిల్కు అర్హమైనది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసును మరింత లోతుగా విచారించేందుకు ఈడీకి పూర్తి స్వాతంత్య్రం ఇస్తున్నట్లు పేర్కొంది. కీలక దశలో విచారణ కొనసాగుతున్న ఇటువంటి పరిస్ధితుల్లో చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు అంతరాయం కలగవచ్చునని సుప్రీం అభిప్రాయపడింది.