కరోనా వైరస్ మానవాళిని వణికించేస్తోంది. దేశాలకు దేశాలు దీని దెబ్బతో అతలాకుతలం అయిపోతున్నాయి. ఇక మన దేశానికి కరోనా చుక్కలు చూపిస్తోంది. కనిపించని కరోనా పై యుద్ధం చేయడానికి దేశం సిద్ధం అయింది. కరోనా నుంచి రక్షణ కోసం భారత ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు ప్రధాని మోడీ. ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోయారు. నిత్యావసరాలు తప్ప దాదాపుగా అన్నిరకాల వ్యాపార వ్యవహారాలూ స్తంభించిపోయాయి.
ఇక ఈ లాక్డౌన్ తో భారత దేశపు ఆర్థిక రంగం పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే వామ్మో అనిపించక మానదు. బార్క్లేస్ సంస్థ ఈ విషయంలో ఒక నివేదికను రూపొందించింది. భారత దేశం తలపెట్టిన 21 రోజుల లాక్డౌన్ వల్ల ఎంత నష్టం వాటిల్ల వచ్చో లేక్క్లేసింది. ఆ లెక్కల ప్రకారం దేశానికి ఈ సుదీర్ఘ లాక్డౌన్ వల్ల రూ.9 లక్షల కోట్లు మేర నష్టం కలుగుతుందని అంచనా వేసింది. ఇది మన దేశ జీడీపీలో 4 శాతానికి సమానమని ఆ సంస్థ చెప్పింది.
ఇక దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించాలని ఇప్పటికే ఆర్ధిక రంగ నిపుణులు సూచించారు. మన దేశంలో ఈ 21 రోజుల లాక్డౌన్ వల్ల దాదాపు రూ.6.75 లక్షల కోట్లు నష్టపోతుందని బార్క్లేస్ తెలిపింది. అయితే మహరాష్ట్ర వంటి పలు పెద్ద రాష్ట్రాలు లాక్డౌన్ కన్నా ముందు నుంచే లాక్డౌన్ పరిస్థితుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అందువల్ల ఈ నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
ఇటు భారత ప్రభుత్వం త్వరలోనే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ఏప్రిల్ 3 నాటి పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముంది. ఇకపోతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మంగళవారం రోజు పలు కీలక నిర్ణయాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
#coronavirus, #Nirmala Sitharaman, #gdp #indian economy, #covid 19,