ముంబయిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రంతా ముంబయి, శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉండటంతో ప్రధాన రహదారులు,లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షం కారణంగా ముంబైలోని కొన్నిచోట్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడి అంధకారం అలముకుంది. అంధేరీ సబ్వే ప్రాంతంలో నీరు నిలిచపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పైపుల ద్వారా నీటిని తొలగిస్తోంది. కుర్లాలోని సీఎస్టీ రోడ్డు ప్రాంతాలు చిన్న నదులను తలపిస్తున్నాయి. రోడ్లమీదకు వరద ప్రవాహం వస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
రైళ్లకు అంతరాయం..
మరోవైపు వర్షం కారణంగా రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహం ఎక్కువకావడంతో సియోన్ రైల్వేస్టేషన్-మతుంగ స్టేషన్ మధ్య పట్టాలపైకి నీరు చేరడంతో ఆ వైపుగా వెళ్లే రైళ్లను నిలిపివేశారు.జామ్రంగ్- ఠాకూర్వాడీ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో వైపు నడిచే 10 రైళ్లను రద్దు చేశారు. మరో నాలుగింటిని కల్యాణ్- ఇగాట్పురి వైపు మళ్లించారు. ముంబయి నుంచి పుణె వెళ్లే రైళ్లను సైతం ఇగాట్పురి వైపు దారి మళ్లించారు. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.