కరోనా యుద్ధంలో ముందువరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు,నర్సులు,మెడికల్ స్టాఫ్ కు తీపికబురు చెప్పింది హర్యానా ప్రభుత్వం. కోవిడ్-19 సేవల్లో నిమగ్నమై ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు, అంబులెన్స్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లకు రెట్టింపు జీతాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్లాల్ కట్టర్ ప్రకటించారు. ఈ మహమ్మారి తగ్గేంత వరకు వీళ్లకు నెలకు ఇచ్చే జీతం డబుల్ ఇస్తామన్నారు.
అంతేకాకుండా కరోనా వైరస్ విధులు నిర్వర్తిస్తూ ఎవరైనా పోలీసు చనిపోతే వారి కుటుంబాలకు రూ. 30 లక్షల పరిహారాన్ని ఇస్తామని సీఎం ప్రకటించారు. కరోనాపై పోరాడుతున్న పలు విభాగాల వారికి కేంద్రం ప్రకటించిన బీమా పథకం పరిధిలోకి రాని వారికి ఆయా ఉద్యోగ స్థాయిని బట్టి రూ.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం అందజేయనున్నట్లు అంతకు ముందే సీఎం ప్రకటించారు.