Government's soy seeds are not germinating: సర్కార్ సోయ విత్తనాలు రైతులను నిండ ముంచుతున్నాయి. రోజులు గడుస్తున్నా మొలకల జాడ లేదు. కాసులు వర్షం కురిపిస్తోంది అని ఆశపడిన సోయ పంట ఆశలను నిరాశ చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు మొలకెత్తడంలేదు. రైతులను నష్టాలపాలు చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోయ పంటకు ప్రసిద్ది. ఈ సారి కూడా రైతులు భారీ ఎత్తున సోయ విత్తనాలు నాటారు. ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు రైతుల కొంపముంచాయి.
బేల,తాంసి, తలమడుగు, జైనథ్, బోథ్, ఇచ్చోడ ,ఇంద్రవెల్లి , ఉట్నూర్, నార్నూర్ తదితర మండలాల్లో డెబ్బై వేల ఎకరాల్లో సబ్సిడీ సోయ విత్తనాలు నాటారు. పదిహేను రోజులు గడుస్తున్నా మొలకల జాడ కనిపించడంలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలోని సారంగపూర్, బైంసా, ముథోల్,, బాసర, కుబీర్, లోకేశ్వరం, తానూర్ మండలాల్లో కూడా సబ్సిడీ విత్తనాలు మొలకెత్తడంలేదు. సర్కార్ విత్తనాలు నాణ్యతగా ఉంటాయని నాటితే చివరికి ఆ విత్తనాలే తమకు నష్టాలపాలు చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ విత్తనాలపై నమ్మకం లేకపోవడంతో సర్కార్ విత్తనాలు నాటం అని, చివరకు అసలుకు మోసం వచ్చిందని రైతులు వాపోతున్నారు. దీనికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోని పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని నాణ్యత గల సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.