లోక్సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ఈ వారంలో వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 7, 8 తేదీల్లో షెడ్యూల్ వెలువడుతుందని సమాచారం. ఒకవేళ వాయిదా పడితే 11, 12 తేదీల్లో కచ్చితంగా షెడ్యూల్ వెలువడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతోపాటే ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.
మొత్తం ఆరు లేదా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. షెడ్యూల్ ఈ తేదీల్లో ఎప్పుడు వచ్చినా మొదటి దశ నోటిఫికేషన్ ఈ నెల 18న వెలువడుతుందని భావిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ మే 21లోగా పూర్తి చేసేందుకు వీలుగా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం. కాగా జమ్మూకశ్మీర్లో శాసనసభకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా, శాంతిభద్రతల దృష్ట్యా ఇప్పుడే నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఇక పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది.