రతన్లాల్ కుటుంబానికి ఆర్థిక సాయం.. వీర సైనికుడన్న అమిత్ షా
ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ప్రాణాలు విడిచిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ప్రాణాలు విడిచిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రతన్ లాల్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఢిల్లీ అల్లర్లలో మరణించిన రతన్ లాల్ను అమరవీరుడిగా ప్రకటించింది. ఈశాన్య ఢిల్లీలోని గోకుల్పురిలో మూడు రోజులుగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య హింసాకాండలో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆందోళనలు ఉద్రికత్తకు దారి తీయగా.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రతన్ లాల్ ఈ దాడిలో ప్రాణాలు విడిచారు. రతన్ లాల్ మృతికి బుల్లెట్ గాయం కారణమని, అందుకే అతను మృతి చెందినట్లు పోస్ట్మార్టమ్ నివేదికలో తేలింది.
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమరవీరుడి ఆత్మకు శాంతిని కలగాలని రతన్లాల్ భార్యకు లేఖ ద్వారా తన ప్రగాఢ సంతాపం తెలిపారు. 'రతన్లాల్ ధైర్యశాలి, కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న ధీరుడు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుడని' అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అల్లర్లలో మరణించిన రతన్లాల్ను అమర వీరుడిగా ప్రకటించాలంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనలు చెపట్టారు. దీంతో ప్రభుత్వం అతని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. వారికి ఆర్థిక సహాయం కూడా ప్రకటించింది. కాగా..ఈ అల్లర్లలో మరో పోలీస్ అధికారి బలయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్గా పనిచేస్తోన్న అంకిత్ శర్మ(26) అనే పోలీస్ అధికారి అల్లర్లకు తీవ్రంగా గాయపడి మృతిచెందారు. కాగా ఇప్పటికే 50 మంది పోలీసులు సహా 260 మంది ఈ ఆందోళనల్లో తీవ్రంగా గాయపడ్డారు.