వాయు తుపాను ప్రచండ రూపం దాల్చింది. అది అతి తీవ్ర తుపానుగా మారి, గుజరాత్ తీరానికి అతి సమీపంలోకి వచ్చేసింది. ఈ ప్రభావంతో కోస్తా గుజరాత్ ప్రాంతమంతా భారీ వర్షాలు పడుతున్నాయి. పోర్బందర్, దియూల మధ్య ఎక్కడైనా తుపాను తీరం తాకనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 145-155 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఒక్కోసారి ఆ వేగం 175 కిలోమీటర్లు కూడా ఉండే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
తుపాను ముంచుకొస్తున్న నేపథ్యాంలో గుజరాత్లోని 10జిల్లాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. సౌరాష్ట్ర, కచ్ తీరాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.. ఇప్పటిదాకా 1.6 లక్షలమందిని తుపాను సహాయక కేంద్రాలకు తరలించారు. తుఫాను ముంచెత్తేలోపే మరో లక్షన్నర మందిని తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు పది జిల్లాల పరిధిలో 400 గ్రామాలపై తుపాను తన ప్రతాపం చూపవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, త్రివిధ దళాలు అప్రమత్తం అయ్యాయి.
వాయు తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది.. గుజరాత్, మహారాష్ట్ర, కొంకణ్ తీరంలో వర్షాలు కురుస్తున్నాయి.. వాయు తుపాన్ నేపథ్యంలో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం పలు బీచులను మూసివేసింది. కొంకణ్ ప్రాంతంలోని పాలఘర్, థానే, ముంబై, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గలోని అన్ని బీచులను మూసివేయాలని అధికారులను ఆదేశించింది. ఇక తుపాను కారణంగా కర్ణాటకలోని మంగళూరు వద్ద అలల తీవ్రత అధికంగా ఉంది. మత్స్యకారులను సముద్రంలోకి వెల్లొద్దంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో మహారాష్ట్ర గుజరాత్ లోని స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు అధికారులు.
తుపాను విపత్తు నుంచి తేలిగ్గా గుజరాత్ బయటపడాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం, రియల్టైమ్ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలను, పాటిస్తూ, వాటికి సహకరించాల్సిందిగా గుజరాతీలను ఆయన కోరారు. తుపాను సహాయక పనుల్లో పూర్తిస్థాయిలో పాల్గొనాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ పిలుపునిచ్చారు.