బ్రేకింగ్ న్యూస్: భారత్లోకి కరోనా వైరస్.. కేరళలో మొదటి కరోనా కేసు నమోదు
కరోనా వైరస్ భారత్లోకి ప్రవేశించింది. కేరళలో మొదటి కరోనా కేసు నమోదయ్యింది. చైనా వూహాన్ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థికి కరోనా వైరస్ సోకింది. అయితే ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థిని వైద్య బృందం పర్యవేక్షణలో ఉంచారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ దేశం నుంచి విదేశీయులను సురక్షితంగా పంపించేందుకు సిద్ధమని చైనా తెలిపింది. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న వుహాన్ నుంచి భారతీయులను తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. హ్యుబయి రాష్ట్రంలో దాదాపు 250 మంది భారతీయులున్నారు. వారిలో విద్యార్థులే అత్యధికం. అయితే, భారత్ వచ్చిన తర్వాతవారంతా 14 రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది.
చైనాకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రకటించాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఢిల్లీ – షాంఘై సర్వీస్ను నిలిపేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించగా, బెంగళూరు– హాంకాంగ్ రూట్లో ఫిబ్రవరి 1 నుంచి, ఢిల్లీ–చెంగ్డూ రూట్లో 14వరకు సర్వీస్లను రద్దు చేశామని ఇండిగో వెల్లడించింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందే అత్యంత అధిక అవకాశాలు ఉన్న 30 దేశాల్లో భారత్ ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చైనాలో కరోనా వైరస్ బారినపడ్డ నగరాల నుంచి ఎక్కువ సంఖ్యలో విమాన ప్రయాణికులు ఈ 30 దేశాలకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఈ 30 దేశాలకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని గుర్తించారు. అత్యంత ప్రమాదకర దేశాల్లో తొలి 3 స్థానాల్లో థాయిలాండ్, జపాన్, హాంకాంగ్ ఉండగా.. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, భారత్లు ఉన్నాయి.