తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడిపైనే కరోనా వైరస్ సోకిన ఓ రోగి ఉమ్మివేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కరోనా లక్షణాలతో 40 ఏళ్ల వ్యక్తి ఒకరు తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చేరాడు. అతడు చేరినప్పటి నుంచి చికిత్సకు సహకరించకపోగా, ముఖానికున్న మాస్కును తొలగించి వైద్యులపై విసురుతూ వేధించడం మొదలుపెట్టాడు. తాజాగా, తనకు చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడిపై ఉమ్మి వేశాడు. వైద్యుల ఫిర్యాదు మేరకు అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, డాక్టర్తో అసభ్యకరంగా ప్రవర్తించిన కరోనా బాధితుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.