కరోనా కట్టడిలో ఆ రాష్ట్రం దేశానికే ఆదర్శం
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నప్పటికీ కరోనాని కట్టడి చేయడంలో అన్ని రాష్ట్రాలకన్నా మిజోరం రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నప్పటికీ కరోనాని కట్టడి చేయడంలో అన్ని రాష్ట్రాలకన్నా మిజోరం రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు అక్కడ మొత్తం 145 మందికి కరోనా సోకగా వారిలో 30 మంది పూర్తిగా కోలుకున్నారు. ఒక్కరు కూడా చనిపోలేదు. జూన్ 22వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు ఆ రాష్ట్రంలో లాక్డౌన్ను ఏడవ సారి పొడిగించారు.
ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కరోనా కట్టడికి పలు చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వంతో పాటుగా 'యంగ్ మిజో అసోసియేషన్, మిజో వర్తకుల సంఘం, పంపిణీదారుల సంఘం' కూడా కరోనా కట్టడిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. కరోనా కట్టడికి మాస్క్, ఆరడుగుల దూరం తప్పనిసరి అని అందరూ చెబుతుండడంతో వాటిని అక్కడ తప్పకుండా పాటిస్తున్నారు.
అంతేకాకుండా రోజు విడిచి రోజుకు ఎన్ని వాహనాలను రోడ్లపైకి అనుమతించాలి, ఎన్ని దుకాణాలను తెరచి ఉంచాలనే విషయంలో అక్కడి వారు క్రమశిక్షణ పాటిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక రాష్ట్రంలో సీరియస్ రోగులకు చికిత్స అందించేందుకు కేవలం 37 పడకలే ఉండడం, ఆక్సిజన్ వెంటిలేటర్లు కేవలం 27 మాత్రమే ఉండడంతో ముందు జాగ్రత్తలు పాటించడంలో తాము ముందున్నామని అక్కడి రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యదర్శి రామ్ సంగా పేర్కొన్నారు. తామంతా ఒకే జాతి వాళ్ళమని ఎవరికీ ఎలాంటి కష్టం వచ్చినా తాము ముందు ఉంటామని అయన అన్నారు.
ఇక దేశంలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి గడిచిన 24 గంటల్లో భారత్లో 17,296 కేసులు నమోదు కాగా, 407 మంది ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం 4,90,401 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,89,463 ఉండగా, 2,85,636 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 15,301 మంది కరోనా వ్యాధితో మరణించారు.