మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై లోక్సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్ నేతలు పోడియం చుట్టుముట్టారు. ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ నినాదాలు చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే అంశంపై ఆందోళనలు కొనసాగాయి. దీంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
మరో వైపు మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిక వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన ప్రదర్శనకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ నేతృత్వం వహించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఆపాలని, చౌకబారు రాజకీయాలు మానుకోవాలని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.