ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ - 2 మిషన్లో ఇస్రో మరో మైలురాయిని అధిగమించింది. చంద్రయాన్ - 2 భూకక్ష్య వీడి జాబిల్లి కక్ష్య దిశగా విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ మేరకు కక్ష్యను పెంచే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. జీఎస్ఎల్వీలోని ద్రవ ఇంజిన్ను 12 వందల 3 సెకన్ల పాటు మండించి కక్ష్యను పెంచినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఇది జాబిల్లి కక్ష్యకు చేరే ట్రాన్స్ ల్యూనార్ మార్గంలో పయనిస్తోందని ప్రయోగం తర్వాత ఇప్పటి వరకు 5 సార్లు కక్ష్యను పెంచే ప్రక్రియను చేపట్టామని తెలిపారు.
ఇప్పటివరకు చంద్రయాన్ - 2 ఎలాంటి అవరోధం లేకుండా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తోందని ఇస్రో ప్రకటించింది. బెంగళూరు ఇస్రో మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ నుంచి నిరంతర పర్యవేక్షణ జరుగుతుందని వివరించింది. ఈ నెల 20 న చంద్రయాన్ - 2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుందని సెప్టెంబర్ 7 న చంద్రుడి ఉపరితలంపై దిగనుందని తెలిపింది. ఆ సమయంలో మరో 4 కీలక ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని ఇస్రో స్పష్టం చేసింది.