కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరానికి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో షాక్ తగిలింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం తోపాటు చిదంబరంను కూడా ప్రాసిక్యూట్ చేసేందుకు సీబీఐకి అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ప్రాసిక్యూట్ కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చే క్రమంలో పెద్దమొత్తంలో ముడుపులు ముట్టాయని చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆయనను ప్రాసిక్యూట్ కు అనుమతించాలని సిబిఐ కోరింది. కాగా ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరాన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన క్రమంలో తాజా పరిణామాలు ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి.