Rahul Gandhi: రాహుల్ జోడోయాత్రకు బ్రేకులు
Rahul Gandhi: పార్టీ శ్రేణులతో కలసి రాహుల్ ధర్నా
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా అసోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. నిన్న ఉదయం బతద్రవ సత్ర ఆలయ సందర్శనకు వెళ్తున్న రాహుల్ను అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే మోరిగావ్ జిల్లాలో రాహుల్ పాదయాత్రను, సమావేశాన్ని నిలిపివేయాలని ఆ జిల్లా అధికారులు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు దుండగులు ప్రయత్నించే అవకాశమున్నందున అనుమతి నిరాకరిస్తున్నట్టు తెలిపారు.
ఒకే రోజు రెండు ప్రధాన కార్యక్రమాలు.. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ, భారత్ జోడో న్యాయ్ యాత్ర జరుగుతున్నాయి. దీన్ని అదనుగా తీసుకుని సంఘ విద్రోహశక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. శాంతి భద్రతలను కాపాడటంతో పాటు జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న రాహుల్ను దృష్టిలో ఉంచుకుని.. బిహుతోలి వద్ద కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించవద్దని కోరుతున్నామని అధికారులు తెలిపారు.
అంతకుముందు బతద్రవ సత్ర ఆలయానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలసి రాహుల్ ధర్నా చేశారు. తాను ఆలయ దర్శనానికి వెళ్తున్నానని.. సమస్యలు సృష్టించడానికి రాలేదన్నారు. తానేం నేరం చేశానని అధికారులు అడ్డుకున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు.