ఇటీవల బీజేపీలో చేరిన స్టార్ క్రీడాకారులు హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు 78 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేయనుండగా ప్రముఖ క్రీడాకారులు బబితా పొగట్, యోగేశ్వర్ దత్లకు కాషాయ పార్టీ నుంచి టికెట్లు దక్కాయి. బరోడా నుంచి ఒలింపిక్ పతక విజేత, స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్, పెహోవా నుంచి హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్, దాద్రి స్థానం నుంచి మహిళా రెజ్లర్ బబితా ఫొగట్లను బీజేపీ పోటీకి నిలిపింది. తొలి జాబితాలో 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి పోటీ చేసే అవకాశం లభించగా, ఏడుగురు ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. అక్టోబర్ 21న హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 24న ఫలితాలు వెల్లడిస్తారు.