అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమం
ఢిల్లీ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న ఆయన అనారోగ్య కారణాలతో ఎయిమ్స్లో చేరారు. అప్పటి నుంచీ ప్రత్యేక డాక్టర్ల టీమ్ ఆయన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఐతే... తాజాగా ఆయన ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలియడంతో... పలువురు రాజకీయప్రముఖులు హడావుడిగా ఆస్పత్రికి వెళ్లారు. ఇప్పటికే జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు మాత్రం అరుణ్ జైట్లీకి సంబంధించి ఏ హెల్త్ బులిటెనూ జారీ చెయ్యలేదు.
66 ఏళ్ల అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పలు కీలక శాఖలను నిర్వహించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో... 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీచేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చికిత్స కోసం జైట్లీ అమెరికా వెళ్లడంతో.. ఆయన బదులు పియూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ.. కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు.