అమర్నాథ్ యాత్రపై ఉగ్రదాడికి పాక్ కుట్ర పన్నింది. కొద్దిరోజులుగా అమర్నాథ్ యాత్రను అడ్డుకుంటోన్న ఉగ్రమూకలు భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు ఇండియన్ ఆర్మీ గుర్తించింది. ఉగ్రదాడి జరిగే అవకాశమున్నందున తక్షణమే అమర్నాథ్ యాత్రను విరమించుకోవాలని సూచించింది.
కశ్మీర్ లోయలో మరోసారి ఉగ్ర కలకలం రేగింది. అత్యంత పవిత్రమైన అమర్నాథ్ యాత్రపై పాకిస్తాన్ గురిపెట్టింది. యాత్రికులే టార్గెట్గా అతిపెద్ద ఉగ్రదాడికి కుట్ర పన్నింది. అయితే, అమర్నాథ్ మార్గంలో పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు, పాక్ ఆర్మీ ల్యాండ్ మైన్స్, ఐఈడీ బాంబులు, స్నిపర్ గన్స్ను స్వాధీనం చేసుకున్న భారత బలగాలు యాత్రికులను అప్రమత్తం చేశారు. ఉగ్రదాడులకు పాక్ కుట్ర పన్నిందన్న ఇండియన్ ఆర్మీ ఆఫీషియల్స్ తక్షణమే అమర్నాథ్ యాత్రను విరమించుకోవాలని సూచించింది.
అమర్నాథ్ యాత్రకు ఆటంకం కలిగించాలనుకుంటోన్న ఉగ్రవాదుల వెనుక పాక్ సైన్యం ఉందని ఆరోపించిన ఇండియన్ ఆర్మీ అధికారులు అమర్నాథ్ మార్గంలో ఎలాంటి దాడి జరిగినా, అందుకు పాక్ కే బాధ్యతన్నారు. తాము స్వాధీనం చేసుకున్న ఆయుధాలన్నీ పాకిస్తాన్వేనన్న ఇండియన్ ఆర్మీ ఈ కుట్ర వెనుక పాక్ సైన్యం హస్తముందన్నారు. మరోవైపు నిఘా వర్గాలు కూడా అమర్నాథ్ యాత్రికులను, పర్యాటకులను హెచ్చరించింది. ఉగ్రదాడి జరిగే అవకాశమున్నందున వెంటనే కశ్మీర్ లోయను ఖాళీ చేయాలని సూచించింది. ఇండియన్ ఆర్మీ అండ్ ఇంటలిజెన్స్ హెచ్చరికలతో అమర్నాథ్, కశ్మీర్ లోయలో యుద్ధ వాతావరణం నెలకొంది.