భారత్ తోపాటుగా విదేశాలు చేసిన హెచ్చరికలు, జెనీవా ఒప్పందం ఫలించడంతో దిగివచ్చిన పాకిస్థాన్ మన వింగ్ కమాండర్ అభినందన్ ను నేడు(శుక్రవారం) విడుదల చేస్తోంది. వాగా బార్డర్ నుంచి ఆయన భారత్ కు చేరుకోనున్నారు. ఇన్నిరోజులు దాయాది పాకిస్థాన్ చిత్రహింసలు పెట్టినా భారత రహస్యాలు చెప్పని ఆ ధీరుడికి ఆసేతు హిమాచలం జేజేలు పలుకుతోంది. ఎప్పుడెప్పుడు స్వదేశానికి వస్తాడా అని యావత్ భారతావని ఎదురు చూస్తోంది. పాకిస్తాన్ విమానాలను తిప్పికొడుతూ.. ఆ ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్–21 బైసన్ విమాన పైలట్గా ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. పాక్ మేజర్ ఎంత గుచ్చి గుచ్చి ప్రశ్నించినా.. తన పేరు అభినందన్ అని, తాను పైలట్నని, సర్వీస్ నంబర్ 27981 అని చెప్పారే తప్ప ఒక్క రహస్యాన్ని కూడా బయటపెట్టలేదు.
అనవసర ప్రశ్నలకు సారీ సర్ అంటూ సమాధానం దాటవేసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ వీడియోలతో ఇప్పుడు దేశంలో విక్రం అభినందన్ రియల్ హీరోగా మారిపోయారు. కాగా జెనీవా ఒప్పందం ప్రకారం పట్టుబడిన సైనికుడికి అవసరమైన వైద్య చికిత్సలు అందించడంతోపాటు ఆయన్ను కంటికి రెప్పలా చూసుకోవాలి. యుద్ధ ఖైదీని శారీరకంగా ఎలాంటి హింసకు గురి చేయకూడదు హింస కారణంగా బందీ గాయపడినా, ప్రాణం పోయినా, ప్రాణాపాయానికి గురైన ఒప్పందం ప్రకారం తీవ్రమైన నేరం.ఏదైనా ముప్పు నుంచిపూర్తి రక్షణ కల్పించాలి. బందీపై ఎలాంటి వైద్య, శాస్త్ర ప్రయోగాలు నిర్వహించరాదు అని ఈ ఒప్పందంలో ఉంది.