శ్రద్ధా హత్య కేసులో 3 వేల పేజీల ఛార్జిషీట్
* ఛార్జిషీట్లో 100 మందికి పైగా వాంగ్మూలాలు
శ్రద్ధా హత్య కేసులో 3 వేల పేజీల ఛార్జిషీట్
Shraddha Murder Case: దేశవ్యాప్తంగా సంచలనల రేపిన ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై పోలీసులు 3 వేల పేజీల ఛార్జిషీట్ను సిద్ధం చేశారు. ఈ ముసాయిదా చార్జిషీట్లో 100 మందికి పైగా వాంగ్మూలాలు ఉన్నాయి. నెలరోజుల పాటు చేపట్టిన విచారణలో సేకరించిన కీలకమైన ఎలక్ట్రానిక్, ఫోరెన్సిక్ ఆధారాలను పోలీసులు ఛార్జిషీట్లో పొందుపరిచారు. శ్రద్ధను హత్య చేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకోవడంతోపాటు అతనికి చేసిననార్కో, ఫోరెన్సిక్ టెస్ట్ రిపోర్ట్లను కూడా పోలీసులు ఛార్జిషీట్లో ఉదహరించారు. ఈ ఛార్జిషీట్ను న్యాయ నిపుణులు సమీక్షించిన అనంతరం ఈ నెలాఖరులోగా కోర్టులో దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఛతర్పూర్ అడవుల్లో లభించిన శ్రద్ధా ఎముకలు, వాటి DNA నివేదికను కూడా పోలీసులు ప్రస్తావించారు. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ అడవుల్లో జనవరి 4న లభించిన వెంట్రుకలు, ఎముకల నమూనాలు శ్రద్ధా నమూనాలతో సరిపోలినట్లు పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు.
గత ఏడాది మే 18న శ్రద్ధా వాకర్ను అఫ్తాబ్ హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. ఈ ముక్కలను ఫ్రిజ్లో నిల్వ ఉంచి ఆ తర్వాత పలు ప్రాంతాల్లో విసిరేశాడు. పోలీసులు అఫ్తాబ్ను అరెస్టు చేసి మెహ్రౌలీ అడవుల్లో శ్రద్ధా ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. 28 ఏండ్ల అఫ్తాబ్ పూనావాలా గతేడాది నవంబర్ నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. శ్రద్ధా వాకర్ను క్షణికావేశంలో చంపినట్లు అఫ్తాబ్ గతంలో ఢిల్లీ కోర్టుకు తెలియజేశాడు.